దశాబ్ద కాలంగా ఇందూరు రైతాంగం కోసం ఉవ్వెత్తున ఎగిసిపడిన ఓ రైతు కెరటం అస్తమించింది. పసుపు రైతుల కోసం దేశ రాజధానికి తన గళాన్ని వినిపించిన ఓ నిరసన స్వరం మూగబోయింది.
పసుపు బోర్డు సాధన కోసం కొన్ని సంవత్సరాలు తన పాదరక్షలను విడిచి రైతులలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన ముత్యాల మనోహర్ రెడ్డి ఇకలేరు అనే చేదు నిజాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.
20 సంవత్సరాలు పసుపు బోర్డు సాధన కోసం ఉద్యమించిన ఆయన, ఐదు సంవత్సరాలు ఎర్రజన్న పంట మద్దతు ధర కోసం రైతు ఉద్యమాలను దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు సార్లు ధర్నా నిర్వహించి రైతుల పక్షంగా పోరాడాడు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచార సభలో నిజామాబాద్ జిల్లా కేంద్ర పర్యటనకు విచ్చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ జిల్లాకు పసుపు బోర్డు ను మంజూరు చేయడంతో హర్షించిన ముత్యాల మనోహర్ రెడ్డి తిరిగి చెప్పులను తొడుగుకున్నారు.
జీవిత లక్ష్యసాధనను చెవులారా విన్న మనోహర్ రెడ్డి తన్మయుడై… మరల పాదరక్షలతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. పసుపు బోర్డు ఫలాలను తన కన్నులతో చూడకుండానే కను మూయడం బాధాకరమని ఆయన సన్నిహితులు అంటున్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నాయన హైదరాబాదులో తన తుది శ్వాసను విడిచారు. రేపు ఆయన అంత్యక్రియలు హైదరాబాదులో కొంపల్లిలో తన స్వగృహంలో నుండి ప్రారంభించనున్నారు.
జిల్లా రైతాంగానికి ఆయన చేసిన ఉద్యమాలను పలువురు రైతులు కొనియాడుతున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రైతు సంక్షేమం కోసం ముత్యాల మనోహర్ రెడ్డి చేసిన కృషిని రైతులు స్మరించుకుంటున్నారు.
మనోహర్ రెడ్డి మరణం బాధాకరం -కోటపాటి నరసింహనాయుడు గత 25 సంవత్సరాలుగా రైతుల కోసం చేసిన ఉద్యమంలో అలుపెరుగకుండా మనోహర్ రెడ్డి, నేను కలిసి సుదీర్ఘంగా పోరాడినాము.
ఆయనలో ఉన్న ఉద్యమస్ఫూర్తి.. అంకితభావం ఎక్కడ నేను చూడలేదు. ఆయన మృతి నా మనసును కలిచి వేస్తుంది.
