నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న ఆర్వోబీల నిర్మాణాలను వేగవంతం చేసేలా అధికారులకు తగు సూచనలు జారీ చేయాలని ఎంపీ అర్వింద్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి ని కోరారు.
ఆయన ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయి, నిజామాబాద్ లోకసభ నియోజకవర్గ పరిధిలో రైల్వేలకి సంబంధించి, పెండింగ్ లో ఉన్న పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
వారానికి ఒకసారి నడిచే కాజీపేట్ – దాదర్ రైలుని అత్యంత త్వరగా నడిపి, వారానికి మూడుసార్లు నడిచేలా చేయాలని ఎంపీ కోరగా, అతి కొద్ది రోజుల్లో రైలు నడిచేలా తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో అవసరమైన చోట్ల కొత్త ఆర్ఓబీలు,ఆర్ యూబీల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని , దేశ రాజధాని ఢిల్లీకి నిజామాబాద్ మీదుగా రైలు సర్వీస్ ని నడపాలని, పార్లమెంట్ పరిధి మీదుగా తిరుపతి, ముంబై లకు కొత్త రైళ్లను నడపాలని కోరారు.
అంతేకాకుండా గత రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం కారణంగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆర్మూర్ -ఆదిలాబాద్ మరియు బోధన్ -బీదర్ రైల్వే లైన్ల మంజూరు చర్యలను వేగవంతం చేయాలని ఎంపీ అర్వింద్ కోరారు.
అమృత్ భారత్ కింద 53 కోట్లతో చేపడుతున్న నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఆయనకు వివరించారు. ఇవే కాకుండా పార్లమెంట్ పరిధిలో రైల్వేల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ పేర్కొన్నారు.
తాను చేసిన విజ్ఞప్తుల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించి, తగు చర్యలు చేపట్టేలా అధికారులకు ఆదేశాలు ఇస్తానని మంత్రి స్పష్టం చేశారు
