నందిపేట మండలం కొండూరు గ్రామ శివారులో పులి కనపడిందని, తన మేకల మందపై దాడి చేసి వెళ్లిందని మంగళవారం ఆ గ్రామానికి చెందిన జింకల పోతన్న ఇచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్, స్థానిక ఎస్సై చిరంజీవి బుధవారం ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ… కొండూరు జింకల పోతన్న మేకల మందపై దాడి చేసిన జంతువు క్రూరమృగమే అయినా పులి, చిరుత లాంటి పెద్ద మృగానివి కావని, పులి తిరిగే ప్రాంతం దట్టమైన అడవి ప్రాంతమై ఉండాలని, అలాగే చిరుత ఆనవాళ్లు కూడా కనపడడం లేదని, ఆ మేకపై దాడి చేసిన జంతువు, అడవి పిల్లి, అడవి నక్క, అడవి తోడేలు లాంటి జంతువులై ఉండవచ్చునని, అంతకుముందు ఇదే గుట్ట ప్రాంతంలో కూడా కొందరి ఫిర్యాదు మేరకు కొన్ని పాదముద్రలు సేకరిస్తే అవి చిరుత లాంటి జంతువులవి కావని తేలిందని, ఇప్పుడు కూడా ఈ సంఘటన అడవి మధ్యలో జరిగింది
కాబట్టి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని, ఏది ఏమైనా వన్యప్రాణులు ఉండే ప్రాంతానికి మనుషులు రావద్దని, అవి నివసించే ప్రాంతానికి ఎవరు వెళ్లిన వన్యప్రాణుల చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని, అటవీ శాఖ కేసులు నమోదు చేస్తుందని, క్రూర మృగాలు రాకుండా, ప్రాణ రక్షణకై వ్యవసాయదారులు కూడా ఏవైనా విద్యుత్ తీగలు అమర్చిన, విషపూరిత ద్రవాలు చల్లిన కానీ అటువంటి వారిపైన కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని, జనావాసాలకు దగ్గరగా ఉన్న అడవి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, చిరుత లాంటి జంతువులను గుర్తించడం కోసం, ప్రజలకు రక్షణ ఇచ్చేందుకు అటవీ శాఖ తరపున చర్యలు చేపడుతున్నామని, భయాందోళనలకు గురికావద్దని తెలియజేశారు.
వన్యప్రాణుల గురించి ఏదైనా సమాచారం అందిన అది ముందుగా సోషల్ మీడియాలో కాకుండా అటవీ శాఖకు, లేదంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానిక ఎస్సై చిరంజీవి సూచించారు.
