ఎల్లారెడ్డి. పట్నంలోని టీచర్స్ కాలనీలో 15 లక్షల రూపాయల సొత్తు చోరీకి గురైంది. 10 తులాల బంగారం నగలు, 65 వేల రూపాయల నగదు దొంగిలించబడినట్లు ఇంటి యజమాని మంగళవారం గుర్తించాడు. కాలనీ వాసులు బాధితులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి, పట్టణంలోని టీచర్స్ కాలనీలో బోరు బండి వ్యాపారం చేసుకునే రవీందర్ కుటుంబంతో సహా నివసిస్తున్నాడు.
ఆదివారం రోజు వేరే గ్రామానికి కుటుంబంతో సహా వెళ్లాడు. సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగివచ్చాడు. డబ్బులు అవసరం ఉండి రవీందర్ మంగళవారం ఉదయం బీరువా తెరిచి చూడగా, డబ్బులు కనబడలేదు.
అనుమానం వచ్చి పూర్తిగా బీరువా తనిఖీ చేశాడు పది తులాల బంగారు నగలు, 65 వేల రూపాయల నగదు కనబడలేదు. దీంతో అవి దొంగతనానికి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. స్థానిక ఎస్సై బొజ్జ మహేష్ కుమార్ రవీందర్ ఇంటికి వెళ్లి బీరువాను పరిసరాలను తనిఖీ చేశారు.
కేసు నమోదు చేసుకొని ఆయన విచారణ ప్రారంభించారు. కాగా బీరువాలో ఉన్న మరికొన్ని నగలు నగదు అలాగే ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటికి వేసిన తాళం గాని, బీరువాకు వేసిన తాళంగానే యధావిధిగా ఉండడం, బీరువాలో ఉన్న మరికొన్ని నగలు నగదు అలాగే ఉండడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దొంగలైతే మొత్తం నగలు, నగదు ఎత్తుకెళ్లే వారిని, ఇంట్లో వస్తువులు చిందర వందర చేసేవారని కాలనీవాసులు పేర్కొంటున్నారు. తెలిసినవారే దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని అంటున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభిస్తే అసలైన దొంగలు దొరికే అవకాశం ఉన్నట్లు కాలనీవాసులు పేర్కొంటున్నారు.
