ప్రభుత్వం అనుమతులు లేకుండానే విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతూ, లక్షల రూపాయల ఫీజులతో అక్రమ అడ్మిషన్లు చేపడుతున్న డిచ్పల్లి మండలం కేశాపూర్ శివారులోని నారాయణ సీబీఎస్ఈ బ్రాంచ్ను వెంటనే సీజ్ చేయాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని టీజీవీపీ విద్యార్థి సంఘా నాయకులు డిమాండ్ చేశారు.
సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి, టీజీవీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్, ఏఐఎఫ్డీఎస్ జిల్లా కార్యదర్శి మేత్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. 2026-27 విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే, ఎలాంటి అనుమతులు లేకుండా, నిర్మాణంలో ఉన్న భవనంలోనే విద్యాసంస్థను నడుపుతున్నారని ఆరోపించారు.
సీబీఎస్ఈ పేరుతో జిల్లా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులను నిలదీస్తే అనుమతులు లేవని మాటలకే పరిమితమవుతున్నారని, చేతల్లో మాత్రం చర్యలు తీసుకోవడం లేదని నాయకులు విమర్శించారు.
ముఖ్యంగా డిచ్పల్లి ఎంఈఓ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది పలు అనుమానాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాయడం సరికాదని వారు హెచ్చరించారు.
విద్యార్థి సంఘాల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్, విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ సంస్థను సీజ్ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పి.మహేష్, మారుతి, జి.మహేష్, సిద్దు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
