చెమటోడ్చి పండించిన పంటను మార్కెట్కు తెచ్చిన మామిడి రైతుకు కన్నీళ్లే మిగులుతున్నాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆమ్ చూర్ (మామిడి ఒరుగు) విక్రయించేందుకు వస్తున్న రైతులు వ్యాపారుల సిండికేట్తో నిలువునా దోపిడీకి గురవుతున్నారు.
ఇక్కడ వ్యాపారులు చెప్పిందే వేదం.. వారు నిర్ణయించిందే ధర అన్నట్లుగా పరిస్థితి మారింది. అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి రైతులు ఆమూర్ అమ్మకానికి నిజామాబాద్కు తరలివస్తున్నారు. గత సీజన్లో క్వింటాకు రూ.31,000 వరకు పలికిన ధర, ఇప్పుడు ఒక్కసారిగా రూ 25000 లకు పడిపోవడం రైతులను ఆవేదనకు గురి చేస్తోంది.ధర తగ్గించడమే కాకుండా, తూకంలోనూ రైతులను దారుణంగా మోసం చేస్తున్నారు.
కాయలు కోయడం, కూలీల ఖర్చులు, హమాలీ, కాంటా ఖర్చులు భరించి మార్కెట్కు వస్తే.. ఇక్కడ వ్యాపారుల దోపిడీతో అసలు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
“కూలీల ఖర్చులు పెరిగాయి, ఎండలో ఎండబెట్టి ఇక్కడికి తెస్తే ధర లేదంటున్నారు. తరుగు పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో పంట భారీగా వచ్చే అవకాశం ఉన్నందున, ఇప్పటికైనా మార్కెట్ కమిటీ అధికారులు స్పందించి ధర, తరుగు విషయంలో వ్యాపారుల ఆగడాలను కట్టడి చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.
