జల్సాలకు అలవాటు పడి, మద్యం తాగేందుకు డబ్బులు లేక ఆటో దొంగతనానికి పాల్పడ్డ కిలాడీ దొంగను ఐదవ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు.
నగరంలోని న్యాల్కల్ రోడ్డుకు చెందిన జిన్నా నర్సింలు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 13న తన ఆటోను ఆర్.ఆర్. చౌరస్తాలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేయగా, గుర్తు తెలియని వ్యక్తులు దానిని చోరీ చేస్తున్నట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు టౌన్-V పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.నార్త్ రూరల్ సి.ఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో టౌన్-V ఎస్సై ఎం. గంగాధర్ బృందం సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. నెహ్రూ నగర్కు చెందిన షేక్ నయీమ్ (43) ఆటోను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
నిందితుడు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయినప్పటికీ, పనిపాట లేకుండా తిరుగుతూ తాగుడుకు బానిసయ్యాడనీ జల్సాల కోసం డబ్బులు అవసరం కావడంతో, దొంగిలించిన ఆటోను నాందేడ్లో అమ్మేందుకు వెళ్తుండగా.. పక్కా సమాచారంతో అర్సపల్లి బైపాస్ వద్ద పోలీసులు మాటువేసి పట్టుకున్నట్లు తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి రూ. 50 వేల విలువైన బజాజ్ ఆటోను (AP25X4994) స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు రిమాండ్కు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్సై గంగాధర్, ఐడీ పార్టీ సిబ్బందిని సి.ఐ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు.
