అతడు మరణించాడు.. కుటుంబ సభ్యులు అంత్యక్రియలూ ముగించారు. గుండెపోటుతోనే చనిపోయాడని అందరూ నమ్మారు. కానీ, ఖండాతరాల అవతల ఉన్న తమ్ముడికి మాత్రం ఏదో నిగూఢ రహస్యం ఉందనిపించింది. అన్న మృతి సహజమైంది కాదని, దాని వెనుక బలమైన కుట్ర దాగి ఉందన్న అనుమానంతో అతను ఏకంగా ఇజ్రాయెల్ నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం బోర్గాం గ్రామంలో ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి గత శుక్రవారం మృతి చెందాడు. రమేష్ అకస్మాత్తుగా మరణించడంతో, కుటుంబ సభ్యులు అది గుండెపోటుగా పేర్కొంటూ హుటాహుటిన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, ఇజ్రాయెల్ లో ఉపాధి నిమిత్తం ఉంటున్న రమేష్ తమ్ముడికి ఈ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అన్న ఆరోగ్యంపై అప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు లేవని, అకస్మాత్తుగా గుండెపోటు అని చెప్పి అంత్యక్రియలు పూర్తి చేయడం వెనుక ఏదో మతలబు ఉందని అతను భావించాడు. దీంతో తన అన్న మృతి పై అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ బాధితుడు ఇజ్రాయెల్ నుంచే పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదును గంభీరంగా తీసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. నిజానిజాలు నిగ్గుతేల్చాలంటే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడం తప్పనిసరి అని నిర్ణయించారు.
ఈ మేరకు బుధవారం తహశీల్దార్ (ఎమ్మార్వో) సమక్షంలో ఖననం చేసిన రమేష్ మృతదేహాన్ని బయటకు తీయనున్నారు. అక్కడికక్కడే ఫోరెన్సిక్ నిపుణులతో పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు.ఈ మరణం వెనుక అసలు కారణం గుండెపోటా? లేక తమ్ముడు ఆరోపిస్తున్నట్లుగా హత్యా? అనేది పోస్టుమార్టం నివేదిక తర్వాతే తేలనుంది
