వేల్పూర్ మండలం పడగల్ సహకార బ్యాంకులో అవినీతి అక్రమాలు తవ్వినకొద్దీ పుట్టుకొస్తున్న పుట్టల తయారయ్యాయి. గత కొన్నేళ్లుగా తిష్ట వేసుకున్న ఈ అక్రమాల పుట్ట..
తీగ లాగితే డొంక కదిలిన చందంగా తయారైంది. సుమారు గత 20 సంవత్సరాలుగా స్థానిక పాలకులతో కలిసి అధికారులు చేసిన అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
నేనంటే… నేను కాదన్నట్టు ఒకరిపై మరొకరు నెట్టి వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పడగల్ సహకార అవినీతిపై ఆర్మూర్ డివిజన్ లో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. డివిజన్ లోని గతంలో తాళ్ల రాంపూర్, చౌట్పల్లి ఇటీవల సావెల్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం పడగల్ సహకార సంఘం వంతు వచ్చినట్టయింది.
ఉన్నత అధికారులు సహకార సంఘాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిక్కచ్చిగా విచారణ కొనసాగిస్తే… ఈ అవినీతి డొంక పూర్తిగా బట్టబయలవుతుందని స్థానికులు అంటున్నారు.
గత నెల క్రితం మాజీ సొసైటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి సదరు అవినీతి అక్రమాలపై ఏకంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేయాల్సిందిగా జిల్లా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టర్ మురళి ని విచారణ అధికారిగా నియమించారు.
పడగల్ సహకార సంఘాన్ని సందర్శించిన విచారణ అధికారి మురళి గత నిన్నటిలోగా సొసైటీ రికార్డులను స్వాధీన పరచాల్సిందిగా ఆదేశించారు.
దీంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డ స్థానిక కార్యదర్శి తో పాటు చైర్మన్ లు రికార్డులను అప్పగించేందుకు నాన అవస్థలు పడ్డారు. ఓ దశలో పూర్తిస్థాయి రికార్డులు లేకపోవడంతో అవాక్కయ్యారు.
పడిగెల సహకార సంఘానికి సంబంధించిన రికార్డులు గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న డిసిఒ సింహాచలం వద్ద ఉండడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.
విచారణ అధికారి సొసైటీలో విచారణ ప్రారంభించిన తర్వాత కూడా సదరు కనుమరుగైన రికార్డుల కోసం డిసిఓ సింహాచలం చుట్టూ స్థానిక సెక్రటరీ మోహన్ తిరుగులాడటంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
సొసైటీలో ఉండాల్సిన రికార్డులు డిసిఒ కార్యాలయంలో ఉండడం పై సదరు అధికారి వద్ద నుంచి జవాబు కరువైంది.ఎట్టకేలకు రికార్డులు స్వాధీన పరుచుకున్న అధికారి మురళి స్థానికంగా కాకుండా జిల్లా కేంద్రంలో విచారణ జరపడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో విచారణ పక్కదారి పట్టే అవకాశం ఉందని భావిస్తున్న స్థానిక రైతులు పడగల్ లోనే విచారణను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
