బైక్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించిన ఇద్దరు దుండగులు, ఒక మహిళ మెడలో నుంచి తులంన్నర బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు.
ఈ ఘటనా మాక్లూర్ మండలంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..భోజవ్వ తన భర్తతో కలిసి ఓ శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి వస్తున్నారు. వీరి వాహనం రామచంద్రపల్లి గ్రామంలోకి ప్రవేశిస్తున్న క్రమంలో, వెనుక నుంచి యాక్టివాపై వచ్చిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు వేగంగా వారిని సమీపించారు.
క్షణాల వ్యవధిలోనే దుండగులు భోజవ్వ మెడలోని సుమారు తులంన్నర బంగారు గొలుసును బలవంతంగా లాగారు. బాధితులు తేరుకునేలోపే నిందితులు తమ వాహనంపై అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు.
బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నప్పటికీ, అప్పటికే దుండగులు కనుమరుగయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
