తాగుడుకు బానిసై అక్రమ సంబంధాలతో వేధిస్తున్నాడన్న కోపంతో కట్టుకున్న భార్యే కాలయముడైంది. కొడుకు సహకారంతో భర్తను హతమార్చి, ఏమీ ఎరగనట్టు కట్టుకథ అల్లినా పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.
మాయాపూర్ గ్రామంలో జరిగిన పుంటికూర ముత్యం హత్య కేసు మిస్టరీని పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాయాపూర్ గ్రామానికి చెందిన పుంటికూర ముత్యంకు భార్య లలిత, 17 ఏళ్ల కుమారుడు ఉన్నారు.
ముత్యం అక్రమ సంబంధాలు పెట్టుకోవడంతో పాటు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తుండటంతో కుటుంబంలో నిత్యం కలహాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో ముత్యంను వదిలించుకోవాలని లలిత నిర్ణయించుకుంది. ఈ నెల 5న రాత్రి ముత్యం మద్యం సేవించి నిద్రలో ఉండగా, లలిత తన చీర అంచుతో మెడకు ఉరి బిగించింది.
కుమారుడు తండ్రి కాళ్లు కదలకుండా గట్టిగా పట్టుకోవడంతో ముత్యం ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, ముత్యం మద్యం మత్తులో మంచం మీద నుండి కింద పడి చనిపోయినట్లు నిందితులు ప్రచారం చేశారు. అయితే మృతుడి బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. నేరానికి ఉపయోగించిన చీర ముక్క, కత్తెర, బెడ్షీట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితురాలు లలితతో పాటు ఆమె కుమారుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
