జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు నిఘా తీవ్రం చేశారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య జారీ చేసిన కఠిన ఆదేశాల నేపథ్యంలో ఆర్మూర్ పరిధిలో శనివారం ఒక పెద్ద పేకాట స్థావరాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.
పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు, సిసిఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ప్రత్యక్ష పర్యవేక్షణలో చీతా ఫోర్స్ సిబ్బంది ఈరోజు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేపూర్ శివార్లలో గల సాయన్న ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున పేకాట సాగుతున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది.
ఈ సమాచారంతో చీతా టీం సభ్యులు అత్యంత వ్యూహాత్మకంగా, అకస్మాత్తుగా సాయన్న ఫామ్ హౌస్ను చుట్టుముట్టారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన జూదరులను సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు.
ఈ మెరుపు దాడిలో పోలీసులు ముగ్గురు (3) పేకాట రాయుళ్లను సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 18,300/- నగదు, జూదం ఆడటానికి వచ్చిన వారు ఉపయోగించిన 2 క్రెటా కార్లు, కమ్యూనికేషన్ కోసం వాడిన 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
రైడ్ విజయవంతంగా ముగిసిన అనంతరం, పట్టుబడిన ముగ్గురు నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు, కార్లు, సెల్ ఫోన్లను చీతా ఫోర్స్ సిబ్బంది తదుపరి విచారణ నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కి అప్పగించారు. ఆర్మూర్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఫామ్ హౌస్లు, తోటలు లేదా రహస్య ప్రదేశాలలో ఎలాంటి జూదం, పేకాట క్లబ్బులు నిర్వహించినా, చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
