చాలకాలం తర్వాత గంజాయి అడ్డా మీద చితాఫోర్స్ పంజా విసిరింది. రుద్రూర్ మండల కేంద్రంలో మెరుపు దాడి చేసింది రైస్మిల్లును కేంద్రంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తున్న ముఠాపై సిసిఎస్ ఎసిపి శ్రీశైలం ఆధ్వర్యంలో చీతా ఫోర్స్, సిసిఎస్ అధికారులు శనివారం మెరుపుదాడి నిర్వహించి సుమారు ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో బీహార్కు చెందిన బల్వంత్ కుమార్ సింగ్ తో పాటు స్థానికుడు కోటగిరి కి చెందిన సంజీవ్ అదుపులోకి తీసుకుని, అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం బీహార్కు చెందిన బల్వంత్ కుమార్ సింగ్ సుమారు రూ.50 వేల అప్పు చేసి బీహార్ నుంచి ఐదు కిలోల గంజాయిని కొనుగోలు చేసి రుద్రూర్కు తీసుకొచ్చినట్లు సమాచారం. అనంతరం స్థానికుడు సంజీవ్ ఆ గంజాయిని సుమారు రూ.లక్షకు కొనుగోలు చేసి, ఇద్దరూ కలిసి స్థానిక రైస్మిల్లులో పనిచేసే కార్మికులను లక్ష్యంగా చేసుకుని చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు తెలిసింది.
ఈ వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న చీతా ఫోర్స్ సిసిఎస్ ఎసిపి శ్రీశైలం ఆధ్వర్యంలో శనివారం ఆకస్మికంగా దాడి నిర్వహించి, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. ఈ గంజాయి బీహార్ నుంచి ఏ మార్గంలో తరలించారు? ఈ దందాలో మరెవరెవరి ప్రమేయం ఉంది? గతంలో కూడా ఇదే తరహాలో విక్రయాలు జరిగాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారికంగా పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
