దర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ కేంద్రం ద్వారా మిల్లులకు ధాన్యం తరలింపు విషయంలో ఒకింత జాప్యం జరుగుతోందని కలెక్టర్ దృష్టికి రాగా, వెంటనే స్పందించిన కలెక్టర్ దమ్మన్నపేట కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో కేంద్రం నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు రైతుల నుండి సేకరించిన ధాన్యం ఎంత, ఇంకా ఎంత ధాన్యం సేకరించాల్సి ఉంది అని ఆరా తీశారు.
ఇప్పటికే 13 లోడ్ల లారీల ధాన్యం పంపించామని, మరో ఐదు లారీల వరకు వడ్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సమాచారం అందించినప్పటికీ రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు కోసం లారీలు పంపడం లేదని తెలిపారు.
దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ ట్రాన్స్ పోర్ట్ కంట్రాక్టర్ ను అప్పటికప్పుడు సెల్ ఫోన్ ద్వారా సంప్రదించి లారీలు పంపకపోవడానికి గల కారణం ఏమిటని నిలదీశారు. తక్షణమే సరిపడా లారీలు కొనుగోలు కేంద్రానికి పంపాలని ఆదేశించారు.
రైతులను ఇబ్బందులకు గురి చేసే చర్యలకు పాల్పడితే ఒప్పందం రద్దు చేస్తామని, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, నిర్దేశిత మిల్లులకు పంపాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు.
మిల్లుల వద్ద ధాన్యం వెంటవెంటనే అన్ లోడింగ్ జరగాలని, ట్రక్ షీట్లు సకాలంలో తెప్పించుకుని వేగంగా ట్యాబ్ ఎంట్రీలు చేయాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపులలో జాప్యం జరగడానికి వీలు లేదని అన్నారు.
మరో వారం రోజుల పాటు కష్టపడితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తవుతుందని, ఈ దిశగా అధికారులు, సిబ్బంది అందరూ చొరవ చూపాలని సూచించారు. కలెక్టర్ వెంట ధర్పల్లి తహసిల్దార్ శాంతా, స్థానిక అధికారులు ఉన్నారు.
