నిజామాబాద్ నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం పని తీరుపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష జరిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రెవెన్యూ విభాగం అధికారులతో కలెక్టర్ సమావేశమై పన్ను వసూళ్లలో ప్రగతి, న్యూ అసెస్ మెంట్, మ్యుటేషన్ దరఖాస్తుల ఫైళ్లను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సుదీర్ఘ కాలం నుంచి పలు మ్యుటేషన్ ఫైళ్లు పెండింగ్ లో ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వాటి విషయమై సంబంధిత జోన్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ప్రశ్నించారు.
సత్వరమే పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని, తద్వారా నగర పాలక సంస్థకు ఆదాయం కూడా సమకూరుతుందని కలెక్టర్ సూచించారు. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వంద శాతం పన్ను వసూళ్లు జరగాలని ఆదేశించారు.
భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్దీకరణ, ఎల్.ఆర్.ఎస్, ఇంజనీరింగ్ పనుల పురోగతి తదితర అంశాలకు సంబంధించిన పనితీరును సమీక్షించి, అధికారులకు సూచనలు చేశారు.
100 రోజుల ప్రణాళిక పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. సమీక్షా సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు కమిషనర్ రవిబాబు, రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొన్నారు.
