నగర పాలక సంస్థ 2026-27 బడ్జెట్ సమావేశంలో వెల్లడి..నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
శనివారం నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నగర మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు కీలక దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని ప్రతి వార్డుకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా నగరంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ, తాగునీటి సరఫరా మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ప్రజలకు అందాల్సిన సేవలను వేగవంతం చేయాలని, ఎక్కడా జాప్యం జరగకుండా పారదర్శకత పాటించాలని సూచించారు.
బడ్జెట్లో కేటాయించిన నిధులను దుర్వినియోగం కాకుండా, అత్యవసర పనులకు ప్రాధాన్యత ఇస్తూ సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది.
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన ఉండాలనీ తెలిపారు. నగర ప్రజల అవసరాలే ప్రాతిపదికగా అభివృద్ధి పనులు చేపట్టాలి అని స్పష్టం చేశారు.
నగర సుందరీకరణతో పాటు స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణలో రాజీ పడకూడదని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్,మున్సిపల్ కమిషనర్, వివిధ విభాగాల అధికారులు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
