నిజామాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించనున్న ఇందూరు నగర ఊరపండుగ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు.
ముందుగా నగరంలోని ఊరపండుగలో ప్రతిష్ఠించనున్న అమ్మవార్ల విగ్రహాల తయారు చేస్తున్న ప్రాంతాలను, రహదారులను ఆయన పరిశీలించారు. సందర్శించిన సీపీ, కళాకారులతో మాట్లాడి విగ్రహాల తయారీ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం అక్కడి నుంచి ఊరపండుగ శోభాయాత్ర నిర్వహించే మార్గాన్ని పరిశీలిస్తూ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, ప్రజల రాకపోకల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. తదనంతరం సిర్నపల్లి గడికి చేరుకుని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్వసమాజ సమితి సభ్యులతో సమావేశమై ఊరపండుగ నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, శాంతిభద్రతల అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో ఏసీపీ ప్రకాశ్, నగర సీఐలు, ఎస్ఐలు, సర్వసమాజ సమితి సభ్యులు పోలీస్ కమిషనర్ వెంట పాల్గొన్నారు. ఊరపండుగను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీపీ సూచించారు.
