దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే..ఇందూరు: అంగవైకల్యం భారం కాదని, వారికి సేవ చేసే భాగ్యంగా భావించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. సమగ్ర శిక్ష, విద్యాశాఖ, అలింకో సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పిల్లలకు అంగ వైకల్యం ఉందని బాధపడొద్దన్నారు. భవిత కేంద్రాల్లో అందజేస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అంగ వైకల్యం ఉన్న విద్యార్థులకు భగవంతుడు ఏదో ఒక ప్రతిభను ఇస్తాడన్నారు. లూయిస్ బ్రెయిలీ, అంద సంగీత మేధావి రవీంద్ర జైన్, దివ్యాంగ నృత్య కళాకారిని సుధాచంద్రన్ లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉపకరణాలను అందజేయడంతో పాటు భవిత కేంద్రాలను నిర్మిస్తుందని చెప్పారు. సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి వికలాంగుల పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని పేర్కొన్నారు. అలాగే కొత్త పెన్షన్లను కూడా అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేకసార్లు మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు.
తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి లేఖనందిస్తానని తెలిపారు. అనంతరం 393 మంది విద్యార్థులకు 34 లక్షల విలువ గల ఉపకరణాలను అందజేశారు. అంతకుముందు నూతనంగా నిర్మించిన భవిత కేంద్రాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో డిఇఓ అశోక్, ఎంఈవో లు సాయారెడ్డి, ఎన్ఆర్ గౌడ్, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, ఆ లింకో ప్రతినిధులు డాక్టర్ ప్రత్యూష్, 39 వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి మురళి, బీజేపీ నాయకులు ప్రభాకర్ పవన్ ముందడ, కైరం కొండ మురళి తదితరులు పాల్గొన్నారు.
