వందలాది మంది తరలివచ్చిన నిరుద్యోగులుఉద్యోగం కోసం ఎదురుచూడకుండా..అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ యువతకు పిలుపునిచ్చారు.
యువతలో ప్రతిభ, చదువు, కష్టపడే తత్వం ఉన్నాయని.. వారికి సరైన అవకాశాలు, వేదికలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.ఆదివారం నగరంలోని శ్రీరామ గార్డెన్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత జాబ్మేళాకు వందలమంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో 70కి పైగా కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఒక్క వ్యక్తికి ఉద్యోగం కల్పించడం అంటే.. ఒక కుటుంబానికి భరోసా కల్పించడమేనని పేర్కొన్నారు.
యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే సంకల్పంతో జాబ్మేళా నిర్వహించినట్లు వివరించారు. ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. ‘‘నాకు ఇంగ్లిష్ రాదు.. అనుభవం లేదు.. ఉద్యోగం వస్తుందో లేదో’’ అనే ఆలోచనలతో వెనక్కి తగ్గవద్దని చెప్పారు.
మొదటి ప్రయత్నంలో ఉద్యోగం రాకపోయినా నిరుత్సాహపడకుండా మరో కంపెనీకి ప్రయత్నించాలని సూచించారు. ఒక ఇంటర్వ్యూలో ఎంపిక కాకపోతే మరో అవకాశాన్ని వెతుక్కోవాలని.. ప్రయత్నాన్ని మాత్రం ఆపవద్దని స్పష్టం చేశారు.
ఉద్యోగాల కోసం నిజామాబాద్ యువత హైదరాబాద్, ఇతర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. స్థానికంగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ను ఐటీ హబ్గా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో మంత్రి శ్రీధర్బాబును కలిసి నిజామాబాద్ ఐటీ హబ్లో మెరుగైన కంపెనీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. త్వరలోనే ఐటీ హబ్ను అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
యువతకు అండగా ఉంటా: యువత తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘‘నా తరఫున చేయగలిగింది ఒక అవకాశం తీసుకురావడం వరకు మాత్రమే.. ఆ అవకాశాన్ని విజయంగా మార్చాల్సింది మీరే’’ అని యువతకు స్పష్టం చేశారు.
జాబ్మేళాకు వచ్చాను అనే భావనతో కాకుండా..నా భవిష్యత్తు కోసం ఒక అడుగు ముందుకు వేశాను అనే నమ్మకంతో ఇంటికి వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. యువత తమ కలలను, సామర్థ్యాన్ని నమ్ముకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ యువత దేశంలోనే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ జాబ్మేళాకు హాజరైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు. *
భయాన్ని వీడండి.. ఉద్యోగాన్ని ఒడిసిపట్టండి!- పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ఉద్యోగం రాదనే అపోహ, భయాన్ని పక్కనపెట్టి యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య, సూచించారు. జాబ్మేళాకు పెద్ద సంఖ్యలో కంపెనీలు తరలిరావడంతో యువతలో మంచి స్పందన కనిపించిందన్నారు.
యువత సరైన మార్గంలో పయనిస్తే వారి భవిష్యత్తుతో పాటు కుటుంబాల భవిష్యత్తూ బాగుంటుందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. మొబైల్, సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని.. ‘టెక్నాలజీని మనం వాడాలి.. అది మనల్ని వాడకూడదు’ అని హితవు పలికారు.
