గౌతమ్నగర్లో దారుణం.. పోలీసుల అదుపులో నిందితుడి నిజామాబాద్ నగరంలోని గౌతమ్నగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న 70 ఏళ్ల అరుంధతిపై ఓ వ్యక్తి దాడి చేసి, కత్తెరతో ఆమె చెవులు కోసి కమ్మలు అపహరించుకుని పరారయ్యాడు. L
ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. అరుంధతి ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి దాడి చేసి కత్తెరతో చెవులు కోసి, చెవులకు ఉన్న కమ్మలు తెంపుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
గాయాలతో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మూడో టౌన్ ఎస్సై హరిబాబు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అతడు అదే కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిసింది.దాడిలో తీవ్రంగా గాయపడిన అరుంధతిని చికిత్స నిమిత్తం మహిళా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
