నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మరికొద్ది సేపట్లో సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. పాలకమండలిలో కీలకమైన ఈ స్థానాల కోసం అభ్యర్థుల వేట, సమీకరణాల జోరు కొనసాగుతోంది.ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఇప్పటికే రంగంలోకి దిగి వ్యూహరచన చేశారు.
కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన, అభ్యర్థుల ఎంపికపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పార్టీ విధేయులకు, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసేలా కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఎవరిని బరిలోకి దింపాలి? ఎవరిని ఎంపిక చేసుకోవాలనే అంశంపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.
మరికాసేపట్లో మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల సందడి మొదలుకానుంది. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఎంపికయ్యే ఆ ‘కో-ఆప్షన్’ సభ్యులు ఎవరనే దానిపై నగర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ తరపున ఎవరికి అవకాశం దక్కుతుందోనని ఆశావహులు వేచి చూస్తున్నారు.
