రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూ భారతి ఆర్ఆర్ చట్టంపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొత్తం రాష్ట్రంలో నాలుగు పైలెట్ మండలాలను ఎంపిక చేశారు. కామారెడ్డి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా లింగంపేట మండలం ఎంపికైంది.
ఈ మండలంలో మొత్తం 23 గ్రామాలు ఉన్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న లింగంపేట మండలంలో ఇటీవల రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 4125 అర్జీలు రాగా, వాటిని పరిష్కరించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.
ఇప్పటి వరకు 3180 అర్జీలను పరిశీలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ కోసం మొత్తం కామారెడ్డి అడిషనల్ కలెక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్, నిజామాబాద్ మెప్మా పీడీ రాజేందర్ ఆధ్వర్యంలో 9 గ్రూప్ లను విభజించి ఒక్కో గ్రూపులో సుమారు 10 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి 10 రోజుల పాటు రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.
ఇందులో 4125 మొత్తం దరఖాస్తులు రాగా, ప్రధానంగా కొత్త పాసు బుక్కులకోసం 1590 దరఖాస్తులు, తప్పుల సవరణ కోసం 460, సాధాబైనమా 366, పీఓటి కేసులు 340,కొత్త అసిస్మెంట్ 328, పోడు భూములు కోసం 499, అసిసిమెంట్ లో పేర్లు లేనివి 360, పౌతి కోసం 305 దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.
దీంతో కొత్త ఆర్ఆర్ చట్టంతో ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని రైతులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ పైలెట్ మండలాల్లో ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి వాటి పరిష్కారం ఏ విధంగా సాధ్యమవుతుందని మదింపు వేసుకొని చట్టం ద్వారా వాటిని పరిష్కరిస్తారు.
ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూసమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు ఎంతగానో మేలు చేస్తుందని జిల్లా స్థాయిలోనే భూ రికార్డుల్లోని తప్పొప్పులను సవరణ చేసుకోవడానికి ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించింది.
రాష్ట్రం మొత్తం జూన్ 2 నుంచి భూ భారతి చట్టం అమలు కానున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు సంబంధిత ధ్రువపత్రాలను జోడించి దరఖాస్తు ఫాంతో కలిపి అధికారులకు అందించాలి . ఇందుకోసం రెవెన్యూ సిబ్బందిని బృందాలుగా విడదీసి సమస్యల కోసం అర్జీలు స్వీకరిస్తారు .
