నిజామాబాద్, జూన్ 24 : ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలో పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎరువులు, విత్తన విక్రయ కేంద్రమైన గ్రోమోర్ సెంటర్ ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్ లను, విత్తన బస్తాలపై లాట్ నంబర్, ఎం.ఆర్.పీ ధర, బ్యాచ్ నెంబర్, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించారు. ఎరువులు, విత్తన అమ్మకాలకు తగిన అనుమతులు పొందిన పత్రాలను పరిశీలించి, కేంద్రం నిర్వాహకులకు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రోజువారీగా ఎంత పరిమాణంలో ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి, ఎన్ని రోజులకు ఒకసారి స్టాక్ వస్తోంది అని కలెక్టర్ ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్ లో, ఈ-పాస్ నమోదు వివరాలలో తేడా ఉండకూడదని అన్నారు. కాగా, జిల్లాలో జూన్, జూలై నెలలకు సరిపడా ఎరువులు, విత్తనాల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా కొరత నెలకొనకుండా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. అన్ని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అన్నారు.
నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువుల కారణంగా ఎక్కడ కూడా ఏ ఒక్క రైతు నష్టపోకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు.
నకిలీ ఎరువులు, విత్తన విక్రయాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, తహసీల్దార్ సతీష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారిణి సుధా మాధురి తదితరులు ఉన్నారు.
