విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో కొంతకాలంగా పరారీలో ఉన్న నిందితుడిని వేల్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. జానకంపేటకు చెందిన కొలిప్యాక ప్రవీణ్ను సోమవారం అదుపులోకి తీసుకుని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
2023లో నమోదైన నమ్మకద్రోహం, మోసం కేసులో ప్రవీణ్ నిందితుడిగా ఉన్నాడు. వేల్పూర్, ఆర్మూర్ పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నమ్మించి వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం వారికి వీసాలు పంపకుండా మోసం చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదైనప్పటి నుంచి ప్రవీణ్ పరారీలో ఉన్నాడని, విశ్వసనీయ సమాచారం మేరకు అరెస్టు చేసినట్లు ఎస్హెచ్ఓ సంజీవ్ తెలిపారు.
వీసా ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలి: విదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం వెళ్లేవారు ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. సంబంధిత ఏజెంట్ రిజిస్ట్రేషన్, లైసెన్స్ తదితర ధ్రువపత్రాలను పరిశీలించిన తర్వాతే డబ్బులు చెల్లించాలని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులకు నగదు చెల్లించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు.
