నిజామాబాద్ కేంద్ర కారాగారంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
సోమవారం నిజామాబాద్ కేంద్ర కారాగారంలో నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూ సమావేశంలో ఆయన పాల్గొని భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.జైలులో అమలవుతున్న భద్రతా విధానాలు, బందోబస్తు, సిబ్బంది విధుల కేటాయింపు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిబంధనల ప్రకారం అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.కెమెరాలపై ప్రత్యేక దృష్టి: జైలు పరిసరాలు, ప్రధాన ద్వారాలు, కీలక ప్రాంతాలు నిరంతరం సీసీ కెమెరాల నిఘాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ తెలిపారు. కెమెరాల పనితీరు, రికార్డింగ్, పర్యవేక్షణ వ్యవస్థను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు.
ప్రహరీ, బందోబస్తు పరిశీలన: కేంద్ర కారాగారం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను పరిశీలించిన ఆయన.. ఎక్కడా భద్రతా లోపాలు లేకుండా పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. జైలు వద్ద విధులు నిర్వహిస్తున్న బందోబస్తు సిబ్బంది అప్రమత్తత, పహారా విధానాలను సమీక్షించారు.
ఆసుపత్రి, డీ-అడిక్షన్ కేంద్రం సందర్శన: జైలులోని ఆసుపత్రి, డీ-అడిక్షన్ కేంద్రాలను కమిషనర్ పరిశీలించారు. ఖైదీలకు అందుతున్న వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారికి అవసరమైన సేవలు అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జైలు అత్యంత కీలకమైన భద్రతా ప్రదేశమని, భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని సీపీ పేర్కొన్నారు. జైలు అధికారులు, పోలీసు శాఖ, భద్రతా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో జైల్ సూపరింటెండెంట్ పి. అశోక్కుమార్, డిప్యూటీ జైలర్ మన్మధరావు, జైలర్లు తిరుమలరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) ధరణికుమార్, మెడికల్ ఆఫీసర్ సామ్రాట్, ఆరో టౌన్ ఎస్ఐ కె. సందీప్ తదితరులు పాల్గొన్నారు.
