అత్యవసర పరిస్థితుల్లో గుండె ఆగిపోయిన వ్యక్తికి తక్షణమే అందించే సిపిఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్) ప్రాణదాతగా నిలుస్తుందని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. శ్రీనివాస్ అన్నారు.
బుధవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య శిక్షకులుగా పాల్గొన్నారు. సమయస్ఫూర్తే కీలకం ఈ సందర్భంగా డాక్టర్ ఆయన మాట్లాడుతూ, హఠాత్తుగా గుండెపోటుకు గురైన వారికి ఆసుపత్రికి చేర్చేలోపు అందించే ప్రాథమిక చికిత్స ఎంతో కీలకమని వివరించారు.
సరైన పద్ధతిలో సిపిఆర్ చేయడం ద్వారా మెదడుకు రక్తప్రసరణ ఆగిపోకుండా చూసి, మరణాల రేటును తగ్గించవచ్చని పేర్కొన్నారు. అనంతరం సిబ్బందికి డెమో ద్వారా ఛాతీపై ఒత్తిడి ఇచ్చే విధానం, కృత్రిమ శ్వాస అందించే తీరుపై ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు.
ఉపయోగకరంగా శిక్షణ ఈ శిబిరంలో మొత్తం 25 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొని శిక్షణ పొందారు. క్లిష్ట సమయాల్లో ధైర్యంగా స్పందించి ప్రాణాలను కాపాడేందుకు ఈ తరగతులు తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ప్రజల ప్రాణరక్షణ పట్ల అవగాహన కలిగి ఉండటం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జలగం తిరుపతి రావు, ఆర్ ఎం ఓ డాక్టర్ సాయి రామ్, ఎస్పీఎఫ్ ఏఎస్ఐ సురేష్ గౌడ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
