సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు తెలంగాణ పోలీస్ యంత్రాంగం సమర శంఖం పూరించింది. ‘అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం’ పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఈగిల్ ఫోర్స్ నడుం బిగించింది.
సోమవారం బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీ వేదికగా ‘మాదక ద్రవ్య వ్యతిరేక అవగాహన వారోత్సవాలు’ అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సి.వి. ఆనంద్, డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలను ఆవిష్కరించనున్నారు.
మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల తలెత్తే సామాజిక, ఆరోగ్య సమస్యలను అరికట్టడంలో సామూహిక బాధ్యత ఎంత ముఖ్యమో ఆయన వివరించనున్నారు. జూన్ 22 నుంచి 24 వరకు జరగనున్న ఈ ప్రత్యేక ప్రదర్శనలో వివిధ ప్రభుత్వ విభాగాలు తమ సేవలను ప్రదర్శించనున్నాయి.
ముఖ్యంగా: సైబర్ సెక్యూరిటీ, ట్రాఫిక్ నిబంధనలు, షీ టీమ్స్, భరోసా కేంద్రాల పనితీరును వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. టాస్క్,డిఇపిడబ్ల్యుడి వంటి సంస్థల ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు కల్పిస్తున్న అవకాశాలు, డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా మాదక ద్రవ్యాల బానిసల విముక్తికి చేస్తున్న ప్రయత్నాలను తెలియజేయనున్నారు.
హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఆయుధాలు (వెపన్స్), డాగ్ స్క్వాడ్ ప్రదర్శనలు ప్రజలలో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని, భద్రతపై అవగాహనను పెంచనున్నాయి.మాదక ద్రవ్యాల రహిత ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ వారోత్సవాల్లో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
భద్రత, శాంతిభద్రతల అమలు, పునరావాసం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ఈ స్టాళ్లు దిశానిర్దేశం చేయనున్నాయి. ఈ వారోత్సవాల ద్వారా మాదక ద్రవ్యాల వ్యతిరేక సందేశాన్ని ఇంటింటికి చేర్చడమే ఈగిల్ ఫోర్స్ లక్ష్యం.
