HomeLaw and Orderఅట్టహాసంగా ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి వేడుక.. సమిష్టి కృషితో...

అట్టహాసంగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి వేడుక.. సమిష్టి కృషితో సత్వర ప్రగతి సాధిద్దామని ఎమ్మెల్యేల పిలుపు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విధులు, అధికారాలపై కలెక్టర్ దిశానిర్దేశం..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించారు.

ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డీఆర్ఓ గీత, అన్ని శాఖల అధికారులు, సర్పంచ్ లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జయజయహే తెలంగాణా గేయాలాపనతో సమావేశానికి శ్రీకారం చుట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు.

వివిధ శాఖల జిల్లా అధికారులు తమతమ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి నివేదిక చదివి వినిపించారు. పంట రుణాల మాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్నాలకు బోనస్ చెల్లింపు, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డుల పంపిణీ, గృహజ్యోతి, చేయూత పెన్షన్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు తదితర పథకాల అమలు వల్ల జిల్లాలో ప్రయోజనం పొందుతున్న లబ్దిదారుల వివరాలను వెల్లడించారు.

వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుండి ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న అల్పాహారం పథకం, ఇంటర్మీడియట్ కాలేజీలలో సైతం మద్యాహ్న భోజనం అమలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు తదితర అంశాల గురించి తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గడిచిన రెండున్నర సంవత్సరాలలో జరిగిన ప్రగతి, ఇకముందు చేపట్టబోయే అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తూ పాలనలో వారిని భాగస్వాములు చేయాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.

99 రోజుల స్పష్టమైన కార్యాచరణతో గ్రామ స్థాయి నుండి, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు సమావేశాలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివ్రూద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంపొందించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ, ప్రజలను భాగస్వాములు చేసి సమిష్టిగా కృషి చేసినప్పుడే సత్వర ప్రగతి సాధ్యపడుతుందని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడి దిశగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పంటల సాగులో క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచాలని, తద్వారా ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించినవారు అవుతారని అన్నారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ, అనేక ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతే ధ్యేయంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే తపనతో మొదటి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేశారని, త్వరలోనే రెండవ విడతగా ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయనుందని, నిబంధనలను సైతం సడలించడం జరిగిందని వివరించారు.

రైతులను ఆదుకోవాలనే కృత నిశ్చయంతో కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేసి వరి ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం జరిగిందని గుర్తు చేశారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా జిల్లాలో అధికార యంత్రాంగం 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, చక్కటి సమన్వయం, సమిష్టి కృషితోనే ఇది సాధ్యమయ్యిందని అభినందించారు. రైతులు కూడా సంప్రదాయ వరి సాగుకు బదులు అధిక లాభాలను అందించే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు.

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా కృషి జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన వారందరికి చేరినప్పుడే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఈ దిశగా అధికారులు అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. ప్రత్యేకించి నిజామాబాద్ నగరంలో అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు, డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపు విషయంలోనూ అర్బన్ సెగ్మెంట్ పై ప్రత్యెక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ హక్కులు, బాధ్యతలను గుర్తెరిగి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ప్రత్యేకించి మహిళా సర్పంచ్ లు, కార్పొరేటర్ లు, కౌన్సిలర్లు సమర్ధవంతంగా పని చేస్తూ, తమకు లభించిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబ సభ్యుల జోక్యానికి తావులేకుండా చూసుకోవాలని హితవు పలికారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం తరపున కృషి చేస్తామని భరోసా కల్పించారు. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే పనులను చేపట్టి, సకాలంలో అవి పూర్తయ్యేలా చొరవ చూపాలని, నిధులను పూర్తి స్థాయిలో సక్రమంగా వినియోగం అయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్లు, రేషన్ కార్డులు, బీమా పథకాల ద్వారా అర్హులైన వారు లబ్ది పొందేలా చొరవ చూపాలన్నారు.

నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డిప్యూటి మేయర్ సల్మా తహ్ సీన్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments