ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ను క్రమం తప్పకుండా సందర్శించాలని మండల ప్రత్యేక అధికారులను కలెక్టర్ భవేష్ మిశ్రా దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యా సంస్థల నిర్వహణ గణనీయంగా మెరుగుపడేలా, నాణ్యమైన విద్యా బోధన జరిగేలా మండల స్పెషల్ ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మండల స్థాయి అధికారులను సమన్వయము చేసుకుని ప్రతి వారం – ప్రతి విద్యా సంస్థను తప్పనిసరిగా సందర్శించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాలతో పాటు, జిల్లాలో గల అన్ని కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబాపూలే, బీ.సీ, ఎస్.సీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలను విధిగా సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎక్కడ కూడా ఫుడ్ పాయిజనింగ్, పాముకాటు, తేలు కాటు వంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యా సంస్థలను సందర్శించిన సందర్భంగా గమనించిన అంశాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్ ద్వారా తమకు నివేదించాలని కలెక్టర్ సూచించారు.
ఎక్కడైనా డ్రైనేజీ సమస్య నెలకొని ఉంటే తక్షణమే పరిష్కరించాలని, సానిటేషన్ సమస్య నెలకొనకుండా చొరవ చూపాలన్నారు. శిథిలావస్థకు చేరిన పురాతన భవనాలు ఉంటే, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా వెంటనే వాటిని తొలగింపజేయాలని ఆదేశించారు.
విద్యార్థిని, విద్యార్థుల్లో అభ్యసనా సామర్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు వీలుగా చేపట్టిన ఎఫ్.ఎల్.ఎన్ విధానం ప్రతి విద్యా సంస్థలోనూ పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు.
కాగా, జిల్లా జనగణన హ్యాండ్బుక్ రూపొందించేందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, చారిత్రక ప్రదేశాల సమాచారాన్ని క్షేత్రస్థాయి అధికారులు పక్కాగా అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
