రెండు రోజుల పాటు మూసీ పరివాహక ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి ఆక్రమణలను గుర్తించిన అధికారులు కూల్చివేత దిశగా అడుగులు వేస్తున్నారు. శని ఆదివారాల్లో కూల్చివేతల కార్యం పూర్తీ చేయడానికి హైడ్రా రంగంలోకి దిగబోతుంది.
ఈ మేరకు సర్వే చేసి మార్కింగ్ చేసిన ఇండ్ల ను ఉన్నపలంగా ఖాళీ చేయాలని నిర్వాసితులకు అధికారులు శుక్ర వారం ఫోన్ లు చేసి మరీ అప్రమత్తం చేసారు.
ఆయా ప్రాంతాలలో కూల్చివేత లను అడ్డుకోవడానికి సైతం బస్తీ లో సన్నాహాలు జరుగుతున్నాయి. కూల్చివేత ల విషయంలో మరింత సాగదీత వద్దని కార్యాచరణకు దిగాలని ప్రభుత్వ పెద్దలు అధికారులను పురమాయిస్తున్నారు.
అందుకే తలెత్తే అవాంఛనీయపరిణామాలను అధిగమించే కార్యాచరణ సైతం అధికారులు సిద్ధం చేస్తున్నారు. నిజానికి సర్వే కోసం వెళ్లిన అధికారులకు చుక్కలు కనిపించాయి అడుగడుగునా స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురైంది .
ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి అధికారులతో గొడవకు దిగుతున్నారు పోలీసుల సహాయం లేకుండా వారు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా వారికి సంఘీభావం చెప్పేందుకు కూడా రాని ప్రజాప్రతినిధులను శాపనార్ధాలు పెట్టారు.
ఈ సారి ఓట్లు అడిగేందుకు ఏ ముఖం పెట్టుకుని వస్తారో చూస్తామంటూ వారిపై దుమ్మెత్తి పోయడం తో సర్వే సగంలోనే అధికారులు వెనక్కి వెళ్లారు .
గురువారం అధికారులు బృందాలుగా ఏర్పడి గోల్కొండ ఇబ్రహింబాగ్, లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీ, పాతబస్తీ, చాదర్ ఘాట్, శంకర్ నగర్ , అంబర్ పేట్, ముసారాంబాగ్, కొత్తపేట, మారుతీనగర్, సత్యానగర్ , ఫణిగిరి కాలనీ,ఇందిరానగర్, గణేష్ పురి తదితర ప్రాంతాల్లో సర్వే చేసి మార్కింగ్ చేశారు .
బస్తీలలో మూసీ నిర్వాసితులు వందల సంఖ్యలో గుమికూడి కనీసం సర్వే కూడా చేయకుండా అడ్డుకున్నారు ఓ దశలో ఉద్రిక్తత నెలకొంది. నిర్మాణాలకు అనుమతినిచ్చి ఇప్పుడు కూల్చివేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు .
సుమారు మూడు దశాబ్ధాలకు పైగా అమ్మకాలు, నిర్మాణాలు జరుగుతుంటే చేతులు ముడుచుకుని ఎందుకు కూర్చున్నారంటూ వాదనలకు దిగారు. ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు కడుతున్నామని వాపోయారు.
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 16 అధికారుల బృందాలు సర్వే చేపడుతూ 1595 నిర్మాణాలను గుర్తించారు.సర్వే ప్రక్రియలో అనేక అడ్డంకులు అవాంతరాలు ఎదుర్కున్న నేపథ్యంలో కూల్చివేతల పక్రియ అంత సులువుగా ఎలా సాగుతుందో చూడాలి
