పేద విద్యార్థులకు తమ ట్రస్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని లక్ష్మీ కళ్యాణం మండపంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైశ్యులు అంటే లక్ష్మీ పుత్రులే కాదని సరస్వతీ పుత్రుడు కూడా ఉంటారని తెలిపారు. పదో తరగతి ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
మున్ముందు మరిన్ని విజయాలు సాధించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇప్పటికే అనేకమంది పేద విద్యార్థులకు విద్యను అందజేస్తున్నామన్నారు.
ప్రస్తుతం ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన వారికి కూడా భవిష్యత్తులో తన సహకారం ఉంటుందన్నారు. ఇలాంటి ప్రోత్సాహకాల వల్ల విద్యార్థులు మరింత ఉత్తమంగా రాణించే అవకాశం ఉంటుందన్నారు.
జీవితంలో ఏదైనా దోచుకునే అవకాశం ఉంటుంది కానీ.. విద్యను ఎవరూ దోచుకోలేరన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు పోల విఠల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
