తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నిజామాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో నగరంలోని బహుజన కాలనీలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థులకు ‘విద్యాదానం’ కార్యక్రమంలో భాగంగా పలకలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. వేడుకల్లో భాగంగా ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఓరుగంటి గంగ, ప్రధాన కార్యదర్శి జరీనా బేగంల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహేష్ కుమార్ గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… “గతంలో నిజామాబాద్ జిల్లాలో మమ్మల్ని సాంఘిక బహిష్కరణ చేస్తే, ఆ బహిష్కరణలను ఎత్తివేసే విధంగా అధికారులను ఆదేశించి మాకు అండగా నిలిచింది మహేష్ కుమార్ గౌడ్ అన్న గారే.
ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, దీర్ఘకాలిక ఆయుషుతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ… గజం భూమి కోసం కోర్టుల చుట్టూ తిరిగే ఈ రోజుల్లో, వినోబాభావే స్ఫూర్తితో భూదాన కార్యక్రమాన్ని వారసత్వంగా నిలుపుకోవడంలో మహేష్ అన్నకు తనకు తానే సాటి అని కొనియాడారు. ఆయనను ‘అభినవ వినోబాభావే’గా అభివర్ణించారు.
సొంత భూమిని సైతం ప్రజల ఉపయోగం కోసం దానం చేసిన మహోన్నత వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ అని, మాటలు చెప్పే నాయకులు కొందరైతే, ఆచరణలో చూపే నాయకుడు మహేష్ అన్న అని ప్రశంసించారు.
ఆయన స్ఫూర్తితో జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని గోవర్ధన్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బహుజన కాలనీ సొసైటీ అధ్యక్షులు మారుతి, సుచిత్ర, రమా మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
