సమాజంలో ఎవరూ లేని అనాథలకు తామున్నామంటూ ‘ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ’ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. గత వారం రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనారోగ్యంతో మృతి చెందిన ముగ్గురు గుర్తుతెలియని వృద్ధులకు ఆ సంస్థ సభ్యులు శనివారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.వివిధ ప్రాంతాల్లో మృతి చెందిన ఈ వృద్ధులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు, బంధువులు లభించకపోవడంతో పోలీసులు వారిని అనాథలుగా గుర్తించారు.
మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని పోలీసులు కోరగా, ఇందూరు యువత సంస్థ సానుకూలంగా స్పందించింది. యూవీ ఫౌండేషన్ సహకారంతో నగరంలోని దేవి థియేటర్ పక్కన గల సార్వజనిక్ శ్మశాన వాటికలో హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో 1వ టౌన్ పోలీస్ సిబ్బంది రాజ్ గోపాల్, 3వ టౌన్ సిబ్బంది నిఖిల్, రూరల్ పోలీస్ సిబ్బంది సాయిలు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాన్ని ఇందూరు యువత వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు పర్యవేక్షించగా.. కోశాధికారి జయదేవ్ వ్యాస్, ఇందురీ శేఖర్, దర్శనం రాజు, కృష్ణ మరియు యూవీ ఫౌండేషన్ ప్రతినిధి సతీష్ తదితరులు పాల్గొని మృతదేహాలకు నివాళులర్పించారు.
