ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం సమగ్ర ఇంటింటి సర్వే/ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు 22వ డివిజన్ కార్పొరేటర్ సాయి వైష్ణవి సుధా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
డివిజన్ పరిధిలోని ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వివరాలను నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఆమె ‘బంపర్ ఆఫర్’ను ప్రకటించారు.ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. డివిజన్ ప్రజలందరూ బాధ్యతగా తమ సర్ ఎన్యుమరేషన్ ఫారాలను సంబంధిత బూత్ స్థాయి అధికారులకు సమర్పించాలని కోరారు.
ఫారాలు సబ్మిట్ చేసి, వారి నుంచి ధ్రువీకరణ పత్రం పొందిన వారందరికీ లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి ఆకర్షణీయమైన బహుమతులను అందజేస్తామని ప్రకటించారు.
ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే ప్రతి ఒక్కరికీ ఎంతో కీలకమని, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులైన వారందరి వివరాలు నమోదు కావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోత్సాహక కార్యక్రమాన్ని చేపట్టినట్లు కార్పొరేటర్ తెలిపారు.
డివిజన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
