ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరమని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం నిజామాబాద్లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ రాక్షస పాలనను అంతం చేసేందుకు రేవంత్ రెడ్డి నిరంతరం పోరాటం చేశారని, అటువంటి నాయకుడిపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన జీవన్ రెడ్డి.. తన అవసరాల కోసం పార్టీని వీడుతూ ఇతరులపై నిందలు వేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
“ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగానే ఏఐసీసీ మీకు నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చింది. పార్టీ తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టడం భావ్యం కాదు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ పదవి ముగియకముందే ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇంతకంటే పార్టీ ఇంకేం చేయగలదో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి” అని మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
వేం నరేందర్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2017లో రేవంత్ రెడ్డితో కలిసి పార్టీలోకి వచ్చిన నరేందర్ రెడ్డి, పదవుల కోసం ఆశపడకుండా తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు.
ఆయన సేవలను గుర్తించే ఏఐసీసీ రాజ్యసభ అవకాశం కల్పించిందని స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో పార్టీ కోసం తాము పడుతున్న కష్టాలను జీవన్ రెడ్డి గుర్తించలేదని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
“మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడ ఇరావత్రి అనిల్, మేము రాకూడదని అడ్డుకున్నది మీరు కాదా అప్పుడు మీకు పార్టీ నిబంధనలు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. కేవలం వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడటం సీనియర్ నాయకులకు తగదని, మీపై ఉన్న గౌరవాన్ని మీరే తగ్గించుకోవద్దని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, జగడం సుమన్, సాయి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
