శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శోభాయాత్రల సందర్భంగాn జిల్లాలో డీజే లకు ఎలాంటి అనుమతులు లేవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. శ్రీరామ నవమి,హనుమాన్ జయంతి సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా తెలిపారు.
గురువారం పోలీస్ కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ హాలులో వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, శోభాయాత్ర నిర్వాహకులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు.
శోభాయాత్రలు పూర్తిగా భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవాలని సీపీ సూచించారు. ఉత్సాహం పేరిట సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శోభాయాత్రల్లో డీజే సౌండ్ సిస్టమ్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.
అలాగే డ్రోన్ల వినియోగానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. గత ఏడాది ఏ రూట్లలో అయితే యాత్రలు సాగాయో, ఈసారి కూడా అవే మార్గాల్లో నిర్వహించుకోవాలి. కొత్త రూట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదనీ పేర్కొన్నారు. నిర్వాహకులు తప్పనిసరిగా తగిన సంఖ్యలో వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి.
వారికి ముందే ర్యాలీ నిబంధనలపై అవగాహన కల్పించాలి.సమావేశంలో నిర్వాహకులు అడిగిన పలు సందేహాలను సీపీ నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, టౌన్ ఏసీపీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలతో పాటు విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, ఆర్యసమాజ్, హిందూ వాహిని, ఏబీవీపీ ప్రతినిధులు పాల్గొన్నారు.
