యువత మత్తుకు బానిసై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. మత్తుకు బానిస కావడంతో కుటుంబాల చిన్నాభిన్నమవుతున్నాయనీ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా స్కూల్ విద్యార్థులతో నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.
ఈ ర్యాలీ పాత కలెక్టర్ కార్యాలయం ప్రారంభమై జిల్లా ఫైర్ స్టేషన్ , రాష్ట్రపతి రోడ్డు , ఖలీల్ వాడి, రాజీవ్ గాంధీ ఆడిటరియం వరకు ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2015 సంవత్సరం వరకు దాదాపు 15 లక్షల మంది ఈ డ్రగ్స్ కు బానిసలు అయినట్టు తెలిపారు.
ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం కష్టపడే వారు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేయాలని , యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.
మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు ఉంటుందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు.
గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐఏఎస్ కరోలినా ఛాంగ్ ఎన్.మావీ , నిజామాబాదు అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ ) బస్వా రెడ్డి, డిస్టిక్ వెల్ఫేర్ శ్రీమతి రసూల్ బి , ఎక్సైజ్ సూపర్డెంట్ మల్లారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, నిజామాబాదు ఏసిపి రాజా వెంకట్ రెడ్డి,విద్యార్థులు పాల్గొన్నారు.
