ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మొక్కవోని దీక్షతో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ‘కళ్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ప్రజా ప్రభుత్వ పాలనకు ఉన్న స్పష్టమైన తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ప్రభుత్వ పథకాల అమలులో మధ్యవర్తుల ప్రమేయానికి తావులేకుండా, అత్యంత పారదర్శకతతో లబ్ధిదారులకు నేరుగా ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
పేద ప్రజల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
“పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడంతో పాటు, నియోజకవర్గంలో ఇల్లు లేని అర్హులైన పేదల కోసం 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం” అని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ ఉమారాణి, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, స్థానిక కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
