నిజామాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి, పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు.
ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి, సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విన్నవించారు.ప్రధానంగా బాల్కొండ నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన రహత్ నగర్, నిజామాబాద్ పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్కూల్, కళాశాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
అలాగే నిజామాబాద్ పట్టణంలో ఇళ్లు లేని పేదల కోసం అదనంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా పట్టణంలో మరో ఐటీ టవర్ ఏర్పాటు చేయాలని కోరారు.
పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. ముఖ్యమంత్రితో జరిగిన ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ కూడా పాల్గొని జిల్లా అభివృద్ధికి అవసరమైన ఇతర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
