నగరంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆరవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం… ధర్మపురి హిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న ఒక కుటుంబం తమ బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్ నిమిత్తం ఇళ్లకు తాళం వేసి వెళ్లారు.
కాగా, బుధవారం ఉదయం వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యారు. లోపలికి వెళ్లి పరిశీలించగా.. అల్మారాలో భద్రపరిచిన సుమారు 2 తులాల బంగారు నెక్లెస్, దాంతో పాటు రూ. 10 వేల నగదును దుండగులు అపహరించుకెళ్లినట్లు బాధితులు గుర్తించారు.
వెంటనే ఈ విషయాన్ని ఆరవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరిస్తున్నారు.
