తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ వేములపల్లి శ్రీను నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లారు.
ఇదే అదనుగా భావించిన గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని బీరువా తాళాలను ధ్వంసం చేసి అందులో భద్రపరిచిన సుమారు 50 తులాల బంగారు ఆభరణాలను అపహరించినట్లు బాధితులు తెలిపారు.
ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు హైదరాబాద్లో ఉన్న శ్రీనుకు సమాచారం అందించారు. దీంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి కొత్తపల్లికి చేరుకున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు మాక్లూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
