ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు, ఈఎంఐల భారం తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నస్రులాబాద్ మండలం బస్వాయిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విఠల్ (28) ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మృతుడి భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఇంటి నిర్మాణం కోసం రెండు ఫైనాన్స్ కంపెనీల్లో రుణాలు తీసుకున్నారు. రుణాల ఈఎంఐలు సక్రమంగా చెల్లించకపోవడంతో ఈ నెల 22న ఓ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఇంటిని సీజ్ చేశారు. దీంతో విఠల్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆమె పేర్కొంది.
ఈ క్రమంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
