నిజామాబాద్ నగరంలోని రెండో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం.. అక్కడ ఉన్న ఓ వ్యక్తి వద్దకు కారులో వచ్చిన మరో వ్యక్తి అతడిపై దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది.
అనంతరం కారులోనే అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరనే వివరాలు, హత్యకు దారితీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
