నిజామాబాద్ నగరంలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా కత్తిపోట్లు కలకలం రేపాయి. ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీ కెనాల్ కట్ట సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేయడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
స్థానికులు కథనం ప్రకారం.. అంబేద్కర్ కాలనీ కెనాల్ కట్టకు చెందిన అక్షయ్ (35) లారీ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు, అక్షయ్పై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.
పదునైన కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అతను మరణించాడు. రాత్రి సమయంలో జరిగిన ఈ ఘోరంతో కాలనీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
హత్యకు గల కారణాలు పాత కక్షలా? లేక మరేదైనా వివాదమా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
