ప్రభుత్వ స్థలాల కబ్జాదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలి**తనపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ఆరోపణలను, నిరాధార ప్రచారాలను 8వ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్ తీవ్రంగా ఖండించారు.
శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్ పరిధిలోని రోడ్ల కబ్జాలను, అక్రమ నిర్మాణాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోడ్డు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ కోసం ప్రభుత్వం గతంలో లీజుకు ఇచ్చిందని, సదరు లీజుదారుడు అందుబాటులో లేకపోవడంతో ఆ స్థలాన్ని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రతినిధి జిల్లాల రమేష్తో పాటు మరికొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కార్పొరేటర్ మఠం పవన్ ఆరోపించారు.
ఈ విషయాన్ని గత నెలలోనే జిల్లా కలెక్టర్తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. డ్రైనేజీలు, రోడ్లపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినందుకే కక్ష గట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “గత ఎన్నికల్లో ఓటమి పాలైన కక్షతోనే జిల్లాల రమేష్ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
సోషల్ మీడియాలో నాకు సంబంధం లేని వ్యక్తుల ఆడియో సంభాషణలను వైరల్ చేస్తూ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. గతంలో ఉద్యోగాల పేరిట రమేష్ డబ్బులు వసూలు చేశారని, దీనిపై ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా ఉన్నాయని” పవన్ పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వ్యక్తులను విచారించి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
