- జిల్లా స్థాయి క్రీడాపోటీల పోస్టర్ విడుదల చేసిన ఎన్ఎస్సీ
- సామాజిక చైతన్యమే లక్ష్యంగా మెగా టోర్నీ
- నేటి నుంచే రిజిస్ట్రేషన్ల ప్రారంభం
జిల్లాలోని క్రీడాకారుల ప్రతిభకు మెరుగులు దిద్దడంతో పాటు సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎన్ఎస్సీ) సిద్ధమైంది.
‘నిజామాబాద్ ప్రీమియర్ లీగ్’ (ఎన్పీఎల్) పేరుతో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఎన్ఎస్సీ చైర్మన్ సాయి చైతన్య వెల్లడించారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ టోర్నమెంట్కు సంబంధించిన వివరాలను కమిటీ సభ్యులతో కలిసి ప్రకటించారు.
యువతను క్రీడల వైపు మళ్లించడంతో పాటు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించడమే ఈ లీగ్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. మొత్తం ఐదు విభాగాల్లో (వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, యోగా, క్రికెట్) పోటీలు నిర్వహించనున్నారు. కబడ్డీ పోటీలు కేవలం పురుషులకు మాత్రమే పరిమితం.
క్రికెట్ విజేతలకు ఏకంగా రూ. 1,00,000 నగదు బహుమతి ప్రకటించారు. రన్నరప్కు రూ. 50,000 అందజేస్తారు. వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ విజేతలకు మొదటి బహుమతిగా రూ. 20,000 చొప్పున అందజేస్తారు.
- యోగా: అండర్-14, అండర్-18 విభాగాల్లో విజేతలకు నగదు పురస్కారాలు ఉంటాయి. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈనెల 11 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పేర్లను నమోదు చేసుకోవాలి. కేవలం జిల్లా వాసులకు మాత్రమే అవకాశం ఉన్నందున ఆధార్ కార్డు తప్పనిసరి. ఈనెల 18న డ్రా తీయనున్నారు.
- టోర్నమెంట్ ఏర్పాట్లను ఎన్ఎస్సీ కన్వినర్ బస్వ రెడ్డి, జనరల్ సెక్రటరీ కవిత రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
