రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సరసంఘచాలక్ మోహన్ భాగవత్ శనివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ బలిరాం పంత్ హెడ్గేవార్ పూర్వీకుల స్వగ్రామమైన రెంజల్ మండలం కందకుర్తిలో నూతనంగా నిర్మించిన ‘కేశవ స్ఫూర్తి మందిరాన్ని’ ఆయన ప్రారంభించనున్నారు.
త్రివేణి సంగమ క్షేత్రమైన కందకుర్తిలో హెడ్గేవార్ స్మృత్యర్థం ఈ మందిరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.ఆర్ఎస్ఎస్ చీఫ్ పర్యటన నేపథ్యంలో కందకుర్తితో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర బలగాలు ఇప్పటికే గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
నిజామాబాద్-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ స్ఫూర్తి మందిరం ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలు, స్వయం సేవకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
