జిల్లాలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు, శోభాయాత్రలపై పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించడాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి తీవ్రంగా తప్పుబట్టారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. హిందూ పండుగల సందర్భంగా నిర్వహించే ర్యాలీలకు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టించడం శోచనీయమని పేర్కొన్నారు.
భక్తులను భయభ్రాంతులకు గురిచేయొద్దు జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో ఏటా హనుమాన్ శోభాయాత్రలు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన గుర్తుచేశారు. సారంగాపూర్ హనుమాన్ మందిరానికి వెళ్లే వేలాది మంది భక్తులు, మహిళలు, యువకుల పట్ల పోలీసుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందన్నారు.
“రెండు స్పీకర్లు, ఒక ఊఫర్తో ర్యాలీలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. నిబంధనల పేరుతో నిర్వాహకులను, యువకులను బెదిరించడం దారుణం” అని మండిపడ్డారు. చదువుకునే యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిపై కేసులు నమోదు చేయవద్దని దినేష్ పటేల్ డిమాండ్ చేశారు.
“ఒకవేళ కేసులు పెట్టాల్సి వస్తే జిల్లా అధ్యక్షుడిగా నాపైన లేదా మండల అధ్యక్షులపై పెట్టండి. కానీ అమాయక యువకులను ఇబ్బందులకు గురిచేస్తే బీజేపీ పక్షాన తీవ్రంగా ఖండిస్తాం” అని హెచ్చరించారు. హనుమాన్ శోభాయాత్రలు కచ్చితంగా నిర్వహిస్తామని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పోలీసులు తగిన బందోబస్తు కల్పించి శాంతిభద్రతలను పర్యవేక్షించాలని ఆయన కోరారు.
