నగరంలోని మిర్చి కాంపౌండ్ పరిధిలో మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో అల్లుడు మామపై దాడి చేసిన ఘటన ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సుమలత తెలిపిన వివరాల ప్రకారం.. మిర్చి కాంపౌండ్కు చెందిన ఉపేందర్ దేవ, అతని అల్లుడు ధర్మరాజు మండల్లు ఆదివారం కలిసి మద్యం సేవించారు.
అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఉపేందర్ దేవ తన అక్కతో మాట్లాడుతుండగా.. తన గురించే మాట్లాడుతున్నావంటూ అల్లుడు ధర్మరాజు గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఆవేశానికి లోనైన ధర్మరాజు, పక్కనే ఉన్న జాలిగంటతో మామ ఉపేందర్ తలపై బలంగా కొట్టాడన్నారు.
ఈ దాడిలో ఉపేందర్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుమలత వివరించారు.
