మైనర్ బాలలను ప్రలోభపెట్టి తమ ఇళ్లలోని బంగారం చోరీ చేయించిన వ్యక్తిని నిజామాబాద్ 3వ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ధనుష్ అనే వ్యక్తి కొంతమంది మైనర్ బాలలను ప్రలోభాలకు గురిచేసి, వారి ఇళ్లలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించి తనకు తీసుకురావాలని ప్రేరేపించాడు.
బాలలు ఇంట్లోని బంగారాన్ని అతనికి అందజేశారు. ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో వారు 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సిసిఎస్ ఏసీపీ శ్రీశైలం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో నిందితుడు ధనుష్ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతడి వద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మైనర్ బాలలను నేరాలకు ప్రేరేపించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
